140 లక్షల మంది ఇరానియన్లు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:29 PM
హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.
టెహ్రాన్: హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. దేశం కోసం తాను సైతం ప్రాణత్యాగానికి సిద్ధమేనని అన్నారు.
'ఇరాన్ను కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికి సిద్ధమని ఇప్పటి వరకూ 140 లక్షల మందికి పైగా ఇరాన్ ప్రజలు ప్రకటించారు. నేను సైతం ఇరాన్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం' అని పెజిష్కియాన్ పేర్కొన్నారు.
మానవహారంగా ఏర్పడండి..
హోర్ముజ్ను తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అమెరికా దాడుల నుంచి విద్యుత్ కేంద్రాలను పరిరక్షించుకునేందుకు క్రీడాకారులు, విద్యార్థులు సహా యువత స్వచ్ఛందంగా విద్యుత్ కేంద్రాల వద్దకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీగా రావాలని, మానవహారంగా ఏర్పడాలని ఆ దేశ క్రీడలు, యువజన శాఖ మంత్రి అలీ రెజా రహీమీ పిలుపునిచ్చారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవహారం పేరుతో ఈ కార్యక్రమం చేపట్టాలని ఒక వీడియో సందేశంలో ఆయన కోరారు. మంగళవారం రాత్రి 8 గంటల లోగా హోర్జుజ్ను తెరవకపోతే ఇక గడువు పొడిగింపులు ఉండవని, ఒక్క రాత్రిలోనే తన బలగాలు ఇరాన్ను తుడిచి పెట్టేయగలవని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రాణత్యాగానికి తనతో పాటు, 1.4 కోట్ల ప్రజానీకం సిద్ధంగా ఉన్నారంటూ పెజిష్కియాన్ ప్రకటించడంతో పరిస్థితి మరింత ఆందోళకరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
డెడ్లైన్ తర్వాత 4 గంటల్లో ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు పేల్చేయగలం: ట్రంప్
ఖమేనీ కోమాలో ఉన్నారా.. కీలక నిర్ణయాలలో ఆయన ప్రమేయం లేదా..