ఉక్రెయిన్ డ్రోన్ పవర్.. రష్యాలో 2,000 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి..
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:32 PM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది. సరిహద్దు నుంచి సుమారు 2,000 కిలోమీటర్ల లోపల ఉన్న ట్యూమెన్ ప్రాంతంలోని కీలక చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ స్వయంగా వెల్లడించారు (Ukraine Russia War).
ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన నూతన డ్రోన్లు 3,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయని జెలెన్స్కీ తెలిపారు. ఈ డ్రోన్ల ద్వారానే ట్యూమెన్ చమురు శుద్ధి కేంద్రంపై విజయవంతమైన దాడి నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఈ దాడి వల్ల చమురు శుద్ధి కేంద్రానికి పెద్దగా నష్టం జరగలేదని రష్యా అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ శకలాలు పడటంతో అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారని, భద్రతా చర్యల్లో భాగంగా ఉద్యోగులను అక్కడి నుంచి తరలించినట్లు ట్యూమెన్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు (Tyumen Oil Refinery).
రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీల్లో ట్యూమెన్ కూడా ఒకటి. ఇక్కడ రోజుకు దాదాపు 1.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తారు (Long Range Drones). ఈ కేంద్రం నుంచి దేశీయంగా చమురు సరఫరా జరుగుతుంది. ఇటీవలి కాలంలో రష్యాలోని కీలక చమురు శుద్ధి క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడి చేస్తోంది. గతవారం మాస్కోలోని కీలక రిఫైనరీపై రెండుసార్లు దాడులు చేసింది. ఈ వరుస దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..