ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసిన యూఏఈ
ABN , Publish Date - Aug 19 , 2026 | 09:43 AM
ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 19: ఇరాన్తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ ఈ చర్య తీసుకుంది. ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా... ఇరాన్తో అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలిపివేశామని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ తెలిపారు.
మరో క్షిపణి ముప్పు గురించి దేశ ప్రజల్ని హెచ్చరిస్తూ ఫోన్ అలర్ట్ జారీ చేసిన దాదాపు రెండు గంటల తర్వాత యూఏఈ ఈ ప్రకటన చేసింది. 'ప్రస్తుత పరిస్థితి, క్షిపణి ముప్పు కారణంగా, వెంటనే ప్రజలు సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సదరు ఫోన్ అలర్ట్లో పేర్కొంది. అయితే, ఆ అలర్ట్ను కొద్దిసేపటికే ఉపసంహరించారు.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఇరాన్ దాడుల తీవ్రతను యూఏఈ ఎక్కువగా ఎదుర్కొంది. ఈ ప్రాంతంలోని మరే ఇతర దేశం కంటే ఎక్కువగా, దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు ఆ దేశంపై ఇరాన్ ప్రయోగించింది.
గల్ఫ్లోని నౌకా రవాణాపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరోపించగా, ఈ ఆరోపణను ఇరాన్ ఖండించింది. ఇరాన్ తమ దేశం వైపు క్షిపణిని ప్రయోగించిందన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ ఖండించారు. ఈ వాదన ప్రాంతీయ విశ్వాసానికి, భద్రతా ప్రయత్నాలకు హానికరమని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం