మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:26 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సీఎన్ఎన్ వైట్హౌస్ ప్రతినిధి క్రిస్టెన్ హోమ్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సీఎన్ఎన్ వైట్హౌస్ ప్రతినిధి క్రిస్టెన్ హోమ్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైట్హౌస్ కార్యనిర్వాహక సహాయకురాలు 35 ఏళ్ల నటాలీ హార్ప్తో బంధం గురించి ఒక డెమోక్రటిక్ చట్టసభ్యుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ట్రంప్ను రిపోర్టర్ క్రిస్టెన్ హోమ్స్ కోరారు. దీంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు', 'ఫేక్ న్యూస్' అని మండిపడ్డారు (Donald Trump vs Kristen Holmes).
ఆ తర్వాత హోమ్స్ ఉత్తర కొరియాకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ట్రంప్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.'మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి' అంటూ పలుమార్లు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆమెను 'ఫేక్ రిపోర్టర్' అని కూడా విమర్శించారు. ఉత్తర కొరియాను శాంతింపజేసేందుకు అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించడంపై ట్రంప్ను హోమ్స్ ప్రశ్నించారు (Trump CNN Clash).
ఈ నేపథ్యంలో హోమ్స్పై వైట్హౌస్ కూడా తీవ్ర విమర్శలు చేసింది (Trump Reporter Clash). 'ఏదో ఒక రోజు, మీ పిల్లలు మీ అసహ్యకరమైన, అమానవీయమైన ప్రశ్నను చూస్తారు' అంటూ వైట్హౌస్ బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, ట్రంప్, వైట్హౌస్ నుంచి వచ్చిన విమర్శలను సీఎన్ఎన్ తీవ్రంగా ఖండించింది. హోమ్స్ అడిగిన ప్రశ్నలు సముచితమైనవేనని పేర్కొంటూ, ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినందుకు వారిపై వ్యక్తిగత దాడులు చేయడం అధ్యక్ష పదవికి తగినది కాదని సీఎన్ఎన్ అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్.. పోలీస్ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..