ఇంజిన్లో సమస్య.. మలేషియా విమానంకు తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Sep 07 , 2026 | 08:42 PM
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ సాయంత్రం ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కౌలాలంపూర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ(సోమవారం) సాయంత్రం ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కౌలాలంపూర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానం (MH156) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్బస్ A330-200 రకానికి చెందిన ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 186 మంది ఉన్నారు. విమానంలోని రెండో ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించి ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం అందించారు.
దీంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం 4.40 గంటలకు చేరుకోవాల్సిన ఈ విమానం, కొద్ది నిమిషాల ఆలస్యంగా 4.44 గంటలకు సురక్షితంగా రన్వేపై దిగింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో విమానం సురక్షితంగా కిందకు దిగి.. ఇంజిన్ లోని సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి బయలుదేరింది. ఈ ఘటనపై చెన్నై ఎయిర్పోర్టు సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది చాలా సున్నితమైన విషయమైనప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ల్యాండింగ్ సాఫీగా జరిగింది. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు' అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్హౌస్లోనే చేస్తారా: మంత్రి సీతక్క
రాంచందర్రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత