చైనా నిర్లక్ష్యంతోనే జల విలయం?
ABN , Publish Date - Aug 28 , 2026 | 05:37 AM
నేపాల్లో మహా జల విలయం సంభవించటానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిబెట్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.
నేపాలీ నేతలు, మీడియా ఆరోపణ
న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేపాల్లో మహా జల విలయం సంభవించటానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిబెట్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. బుధవారం సంభవించిన మెరుపు వరదలు నిమిషాల వ్యవధిలో త్రిశూలి, భోటెకోశీ, లెండేఖోలా నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలను తుడిచిపెట్టేశాయి. ఈ మహా విపత్తుకు చైనా నిర్లక్ష్యమే కారణమని నేపాల్ రాజకీయ నాయకులు, మీడియా దుమ్మెత్తిపోస్తున్నారు.
‘భద్రత విషయంలో మా పొరుగుదేశాలతో మేము ఎప్పుడూ సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ మా ఉత్తరభాగంలో ఉన్న దేశం (చైనా) మమ్మల్ని ఎప్పుడూ చులకనగానే చూడటం విచారకరం. భారీ ప్రకృతి విపత్తుల గురించి ఆ దేశం ముందస్తు సమాచారం ఇవ్వకపోవటం వల్లనే మేము తీవ్ర జన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అవసరం ఉన్నా.. లేకపోయినా వారి భద్రతకు మేము ప్రాధాన్యం ఇస్తున్నాం.. కానీ, వారి భూభాగంలో ఏర్పడే ప్రకృతి విపత్తులకు ఎప్పుడూ మేమే నష్టపోవాల్సి వస్తోంది. ఈ వన్సైడ్ ప్రేమ వల్ల నేపాల్ ఎందుకు మూల్యం చెల్లించాలి?’ అని నేపాల్ దినపత్రిక ‘నయా పత్రిక’కు చెందిన జర్నలిస్టు పర్శురామ్ కప్లే ఎక్స్లో ఆగ్రహం వ్యక్తంచేశారు.
నేపాల్ నేతల విమర్శలను చైనా తిప్పికొట్టింది. ఈ ప్రకృతి విపత్తును తాము కూడా గుర్తించలేకపోయామని గురువారం పేర్కొంది. విపత్తుల గురించి నేపాల్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నామని చైనా విదేశాంగశాఖ వెల్లడించింది. భోటెకోశీ నదిలో ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
సీట్లున్నాయి.. విద్యార్థులే కావాలి!
నేపాల్లో చిక్కుకున్న 23 మంది తెలంగాణవాసులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News