మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:32 AM
మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యంగా ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్ శాస్త్రీయ పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
టెహ్రాన్, మార్చి 29: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కావాలనే తమ దేశంలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు చేశారు. ఇరాన్ శాస్త్రీయ పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, చారిత్రక కట్టడాలు, మేధావులను కూడా టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన దాడుల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ సయీద్ షెంకద్రి తన నివాసంలో ఉండగా జరిగిన దాడిలో మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. విద్యాసంస్థలపై దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాలు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని, ఇది యుద్ధ నేరాల కిందకు వస్తుందని ఇరాన్ వాదిస్తోంది.
ఫిబ్రవరి 28 నుండి అమెరికా-ఇజ్రాయెల్ కూటమి - ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వేల సంఖ్యలో పౌరులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలపై దాడులు పెరగడం అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికా తన దాడులను వెంటనే నిలిపివేయకపోతే, ప్రాంతీయంగా ఉన్న అమెరికా విద్యాసంస్థలపై కూడా ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వి కూడా చదవండి...
సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు
అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు
Read Latest AP News And Telugu News