ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:43 PM
ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్కు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో భారత్ గట్టి హెచ్చరికలు చేస్తోంది. తాజాగా కిర్గిస్థాన్లో షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా ప్రధాని మోదీ.. పాక్కు మరోసారి గట్టి సందేశం పంపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని పెంచే పాకిస్థాన్కు ప్రధాని మోదీ గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, దీని విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని పిలుపునిచ్చారు.
‘ఉగ్రవాదానికి నిధులు అందించడం, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, నియామకాలు చేపట్టడం, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఒక విధానంగా ఉపయోగిస్తూ, ఉగ్రమూకలకు మద్దతునిచ్చే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలి. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపద కారాదని తేల్చిచెప్పాలి. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో అన్ని దేశాలు ఒకే వైఖరితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది' ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
నేటికాలం దేశాల మధ్య పరస్పర అనుసంధానం కారణంగా ప్రపంచంలో భద్రతా పరిధి మరింత పెరిగిందన్నారు. పశ్చిమాసియా సంక్షోభం అందుకు నిదర్శనమని చెప్పారు. ఆ ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాలేదని, ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులు ప్రభావితమయ్యాయని మోదీ గుర్తు చేశారు.
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి సూచించారు. అమెరికా- ఇరాన్ యుద్ధం , ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో మోదీ, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పాల్గొన్నారు. బెలారస్, కజక్స్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల అధ్యక్షులు హాజరయ్యారు.
ఇవీ చదవండి:
హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?
విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర