సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..
ABN , Publish Date - Sep 08 , 2026 | 03:37 PM
సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు భారీ దాడులకు పాల్పడ్డారు. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోని పలు పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు భారీ దాడులకు పాల్పడ్డారు. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోని పలు పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో కనీసం 73 మంది గాయపడినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు (Houthi attack on Saudi Arabia).
అబ్హా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఖాలిద్ ఎయిర్బేస్, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం అరామ్కోలను హౌతీలు టార్గెట్ చేశారు. అబ్హా, జిజాన్ ప్రాంతాల్లోని అరామ్కో సౌకర్యాలపై దాడులు జరిగినట్లు సౌదీ అధికారులు తెలిపారు. దాడుల కారణంగా పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. కొన్ని ఇంధన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. జిజాన్లోని కీలక చమురు రిఫైనరీ కూడా దాడికి గురైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి (Houthi Saudi Arabia).
దాడులకు ప్రతిస్పందనగా తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. హౌతీల దాడులను అడ్డుకోవడంతో పాటు ముప్పు మూలాలను నిర్వీర్యం చేస్తామని సౌదీ హెచ్చరించింది. యెమెన్లో సౌదీ మద్దతున్న ప్రభుత్వం, ఇరాన్ మద్దతున్న హౌతీల మధ్య పోరు మళ్లీ తీవ్రరూపం దాల్చిన సమయంలో ఈ దాడులు జరిగాయి (Saudi oil facilities attack).
సౌదీ దాడుల కారణంగా తమ ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగిందని ఆరోపిస్తూ, తాజా దాడులు దానికి ప్రతిస్పందనగా చేపట్టినవేనని హౌతీలు చెబుతున్నారు. సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చమురు మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 98 డాలర్ల పైకి చేరినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
గిల్పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్