హోర్ముజ్ జలసంధిపై కీలక సమావేశం వాయిదా..
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:26 AM
హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలను తాత్కాలికంగా అనుమతించే అంశంపై జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలు పాల్గొనాల్సిన ఈ సమావేశం సోమవారం ఒమన్లోని సలాలాలో జరగాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలను తాత్కాలికంగా అనుమతించే అంశంపై జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలు పాల్గొనాల్సిన ఈ సమావేశం సోమవారం ఒమన్లోని సలాలాలో జరగాల్సి ఉంది. ఏకాభిప్రాయం కోసం సమావేశాన్ని వాయిదా వేశామని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది ఎక్స్లో వెల్లడించారు.
కొన్ని ప్రాంతీయ దేశాల అభ్యర్థన మేరకే సమావేశం వాయిదా పడిందని ఇరాన్కు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది. కొత్త తేదీని ఒమన్తో చర్చించి నిర్ణయిస్తామని ఇరాన్ అధికారులు చెప్పినట్లు వెల్లడించింది. అయితే, ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్ దాడి తర్వాత సౌదీ అరేబియా తన ఈస్ట్-వెస్ట్ చమురు పైప్లైన్ను మూసివేసింది. హోర్ముజ్ జలసంధిని తప్పించుకుని చమురును తరలించేందుకు ఈ పైప్లైన్ను కీలకంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశలు తగ్గిపోయాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
కాగా.. హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఓ నౌకపై దాడి జరిగిందని బ్రిటిష్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) తెలిపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగడంతో సిబ్బందిని బయటకు తరలించినట్లు పేర్కొంది. మరోవైపు, ఇరాన్ తీరానికి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒకరు మృతిచెందగా.. నలుగురు సిబ్బంది గాయపడ్డారని ఇరాన్ వెల్లడించింది. దీంతో హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఇరాన్ దాడులలో ప్రకాశం జిల్లా వాసికి తీవ్రగాయాలు
9/11 దాడులకు ముందే భారత్పై ఉగ్రదాడికి లాడెన్ కుట్ర!