ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపు
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:46 AM
ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ఆయన ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి యుద్ధం కంటే చర్చలే మార్గమని స్పష్టం చేశారు.
పారిస్, మార్చి 23: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఇంధన మౌలిక సదుపాయాల రక్షణే ధ్యేయంగా ఈ సంభాషణ సాగింది.
గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని అన్ని పక్షాలకూ మాక్రాన్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతాయని ఆయన హెచ్చరించారు. సౌదీ అరేబియాపై జరుగుతున్న డ్రోన్, మిస్సైల్ దాడులను ఖండిస్తూ, ఆ దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ఫ్రాన్స్ పూర్తి మద్దతునిస్తుందని మాక్రాన్ పునరుద్ఘాటించారు.
ముఖ్యంగా సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకరిస్తామని మాక్రాన్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాలని, ఇరాన్ తన బాధ్యతను గుర్తించాలని మాక్రాన్ కోరారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండాలంటే యుద్ధం చేస్తున్న పక్షాలన్నీ సంయమనం పాటించాలని, కేవలం చర్చల ద్వారానే శాంతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో G7 దేశాలు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఫ్రాన్స్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు