Share News

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ABN , Publish Date - Apr 10 , 2026 | 07:13 PM

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్చీకే పరిమితం కావడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది.

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
Long Sitting Health Risks

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్చీకే పరిమితం కావడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీని వల్ల హైబీపీ, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీనినే వైద్య నిపుణులు 'సిట్టింగ్ డిసీజ్' అని పిలుస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకుందాం.


1. గుండె సంబంధిత వ్యాధులు:

ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొన్నప్పుడు కండరాలు తక్కువ కొవ్వును ఖర్చు చేస్తాయి, దీనివల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మరియు రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండు రేట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. మధుమేహం:

శారీరక శ్రమ లేకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరం శారీరక శ్రమలో లేనప్పుడు, ఇన్సులిన్‌కు స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కేవలం ఒక్క రోజు ఎక్కువ సమయం కూర్చొన్నా, మన శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకోలేక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్‌కు దారితీస్తుంది.

3. ఊబకాయం:

గంటల కొద్ది ఒకే చోట కూర్చొన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారడానికి బదులు కొవ్వుగా మారి పొట్ట, నడుము భాగాల్లో పేరుకుపోతుంది. ముఖ్యంగా 'లైపేజ్' అనే ఎంజైమ్ (కొవ్వును కరిగించేది) కూర్చొన్నప్పుడు తగ్గిపోవడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు.

4. వెన్నుముక, మెడ సమస్యలు:

చాలా‌మంది కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు కూర్చొన్నప్పుడు ముందుకు వంగి కూర్చుంటారు. దీనివల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలిక వెన్నునొప్పి, మెడ నొప్పి, డిస్క్ సమస్యలకు దారితీస్తుంది.

5. కాళ్లలో రక్త గడ్డకట్టడం:

కాళ్లు ఎక్కువ సేపు కదలకుండా కిందకు వేలాడదీసి కూర్చోవడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంది. ఇది ఒక్కోసారి ఊపిరితిత్తులకు పాకి ప్రాణాంతకంగా మారవచ్చు.

6. కండరాల క్షీణత:

కుర్చీ మీద కూర్చొన్నప్పుడు మన కాళ్లు, తుంటి భాగంలోని కండరాలు అసలు పని చేయవు. దీనివల్ల కాలక్రమేణా ఆ కండరాలు బలహీనపడి, నడకలో అస్థిరత, కండరాల నొప్పులు మొదలవుతాయి.

7. మానసిక ఆరోగ్య సమస్యలు:

శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడుకు అందే ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు దారితీసే అవకాశం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 సెకన్ల పాటు సీటులో నుంచి లేచి నిలబడండి లేదా చిన్నగా అటు ఇటు నడవండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

  • ఆఫీసులో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూర్చొని కాకుండా, అటు ఇటు నడుస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోండి. అలాగే సహోద్యోగులతో చర్చలు ఉన్నప్పుడు 'స్టాండింగ్ మీటింగ్స్' నిర్వహించడం ఉత్తమం.

  • కూర్చొనేటప్పుడు వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోండి. కంప్యూటర్ స్క్రీన్ మీ కళ్లకు సమాంతరంగా ఉండాలి. పాదాలు నేలకు ఆనించి ఉంచడం వల్ల వెన్నుపై ఒత్తిడి తగ్గుతుంది.

  • ఆఫీసులో వీలైనంత వరకు లిఫ్టు వాడకం తగ్గించి మెట్లు ఎక్కండి. ఇది మీ కండరాలకు మంచి వ్యాయామాన్ని ఇస్తుంది.

  • కూర్చొన్న చోటే మెడను అటు ఇటు తిప్పడం, భుజాలను ఆడించడం, కాళ్లను చాచడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ఇవి కండరాల బిగుతును తగ్గిస్తాయి.

  • సాధ్యమైనంత వరకు మంచి నీళ్ల బాటిల్‌ను మీ డెస్క్ మీద ఉంచుకోండి. నీరు తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా, బాటిల్ నింపుకోడానికి లేదా వాష్‌ రూమ్‌కు వెళ్లడానికి అయినా మీరు సీటులో నుంచి లేవాల్సి వస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Apr 10 , 2026 | 07:16 PM