బిగ్ అలర్ట్.. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. ఎన్టీఏ వెల్లడి
ABN , Publish Date - May 15 , 2026 | 10:16 AM
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) శుక్రవారం వెల్లడించింది. మే 3న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. రీ-ఎగ్జామ్ కు సంబంధించిన వివరాలపై.. అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది. హాల్ టికెట్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం మే 3న నీట్ యూజీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల ఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో.. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి విచారణను సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. పేపర్ లీక్ వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించే క్రమంలో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు విచారణ కొనసాగుతుండగానే.. విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఎన్టీఏ ఈ రీ-ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News