Share News

నో ఎగ్జామ్.. అప్లై చేస్తే చాలు.. నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

ABN , Publish Date - Aug 27 , 2026 | 05:49 PM

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి ఆగస్టు నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభకానుంది.

నో ఎగ్జామ్.. అప్లై చేస్తే చాలు.. నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

ఇంటర్నెట్ డెస్క్: పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి ఆగస్టు నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు31 నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోస్టల్ శాఖ అధికారులు అవకాశం కల్పించారు.

సెప్టెంబర్ 2 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్23, 24 తేదీల్లో దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుం నుంచి పోస్టల్ శాఖ మినహాయింపు ఇచ్చింది.


పరీక్ష లేదు..

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)/ డాక్‌సేవక్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్‌లో పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.

వేతనం ఎంతంటే..?

ఈ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతనం రూ.12 వేలు నుంచి రూ.29,380, ఏబీపీఎంకు రూ.10 వేలు నుంచి 24,470గా నిర్ణయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున వయస్సులో సడలింపు ఇచ్చింది.


తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలెన్నంటే..?

ఏపీలో 918, తెలంగాణలో 419 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లుగా వెబ్‌‌సైట్‌లో పేర్కొన్నారు. ఏ సర్కిల్‌లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో.. https://www.indiapost.gov.in/gdsonlineengagement వెబ్‌సైట్‌లో వేకెన్సీ పోస్టులపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్‌లకు ప్రోత్సాహకాలు అందిస్తారు.


10వ తరగతి మార్కుల్లో..

మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష మార్కులు పరిశీలిస్తారు.

అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

జేఎన్‌టీయూలో ‘బెస్ట్‌’ శిక్షణ!

జాతీయ ర్యాంకింగ్స్‌లో ఓయూ సత్తా

For Education News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 06:43 PM