బైకును ఢీకొని కాలువలో పడిన కారు
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:29 PM
కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
మహిళ మృతి.. మరో ఎనిమిది మందికి గాయాలు
మహాశివరాత్రి జాగరణచేసి వస్తుండగా ప్రమాదం
వెదురుకుప్పం(అన్నమయ్య): కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కార్వేటినగరం మండలం ఆలత్తూరు గ్రామ పంచాయతీ చేకువారిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి భార్య బి.దేవిక సహా ఎనిమిది మంది సోమవారం కారులో పుత్తూరు సమీపంలోని సదాశివకోనకు వెళ్లారు. మహాశివరాత్రి జాగరణకు వెళ్లి మంగళవారం వేకువజామున తిరుగు ప్రయాణమయ్యారు.
కార్వేటినగరం మండలం తురకమిట్ట క్రాస్ రోడ్డు.. చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిపై డ్రైవరు జ్యోతికుమార్ వేగంగా కారు నడుపుతూ ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన కాలువలో బైక్ పడింది. బైకు నడుపుతున్న కొత్తఇండ్లుకు చెందిన మునికృష్ణ గాయపడ్డాడు. బైక్ను ఢీకొట్టిన ధాటికి కారు రోడ్డు పక్కన దూరంగాఉన్న కాలువలో పడి ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న బి.దేవిక, డ్రైవరు జ్యోతికుమార్, సి.మాధవి, బి.గాయత్రి, బి.బుజ్జి, హరిభూషణ్, మోక్షిత్రెడ్డి, జయదివ్య గాయపడ్డారు.
వీరిని కార్వేటినగరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే దేవిక(40) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. మృతురాలి భర్త శ్రీనివాసులురెడ్డి ఫిర్యాదు మేరకు కార్వేటినగరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో పదినిమిషాల్లో ఇల్లుచేరనున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి జాగరణకు వెళ్లి దేవిక మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
Read Latest Telangana News and National News