ఏసీ మెకానిక్నంటూ ఫ్లాట్లోకి చొరబడి..
ABN , Publish Date - Mar 21 , 2026 | 09:33 AM
ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఏసీ మెకానిక్నంటూ ఫ్లాట్లోకి ప్రవేశించిన యువకుడు మహిళా టీచర్ తలపై ఇనుప సుత్తితో మోది.. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యాడు.
సుత్తితో టీచర్ తలపై మోది.. పుస్తెలతాడుతో పరార్
40 నిమిషాల్లో నిందితుడి పట్టివేత
25 గ్రాముల బంగారు పుస్తెల తాడు స్వాధీనం
హైదరాబాద్: ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఏసీ మెకానిక్నంటూ ఫ్లాట్లోకి ప్రవేశించిన యువకుడు మహిళా టీచర్ తలపై ఇనుప సుత్తితో మోది.. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో క్రైమ్టీం 40 నిమిషాల్లో నిందితుడిని పట్టుకుని పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ వివరాల ప్రకారం.. రాక్హిల్స్ కాలనీలో శైలజా రెసిడెన్సీలో ఉండే చింతారెడ్డి ప్రవీణారెడ్డి(42) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు.
శుక్రవారం చంచల్గూడ, చావినికి చెందిన అబ్రార్ అహ్మద్ ఏసీ మెకానిక్నంటూ పరిచయం చేసుకుని ఫ్లాట్ లోకి ప్రవేశించి ఇనుప సుత్తితో ఆమె తలపై మోదాడు. వెంటనే మెడలోని బంగారు పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యాడు. క్షణాల్లోతేరుకున్న ఆమె 100కు డయల్ చేయడంతో ఎల్బీనగర్ క్రైమ్ టీం డీఎస్ఐ నరేందర్ సిబ్బందితో రంగంలోకి దిగి గాయపడిన టీచర్ను కామినేని ఆస్పత్రికి తరలించారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా సమీపంలో మరో అపార్టుమెంట్ లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించిన నిందితుడిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడు కొన్నాళ్ల పాటు అమెజాన్లో చిన్న ఉద్యోగం చేశాడని ఆర్థిక ఇబ్బందులతో ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఏసీపీ కృష్ణయ్య బాధితురాలిని పరామర్శించి, ఆమె ఫ్లాట్ను సందర్శించి వివరాలు సేకరించారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
Read Latest Telangana News and National News