Hyderabad: పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:43 AM
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గొల్ల రవి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్(Madhuranagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన గొల్ల రవి(25) ఆటో డ్రైవర్. లక్ష్మీనరసింహ నగర్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. డిసెంబరులో అయ్యప్ప దీక్ష తీసుకొని శబరియాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. దీక్షలో ఉన్నప్పుడు పక్క గల్లీలో ఒక గదిని కిరాయికి తీసుకొని ఒక్కడే ఉన్నాడు.
దీక్ష తీసిన తర్వాత శుక్రవారం సాయంత్రం అద్దెకు తీసుకున్న గదికి వెళ్లి స్నేహితుడు శ్రావణ్కు ఫోన్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. శ్రావణ్ వెంటనే రవి ఉన్న ఇంటికి వచ్చాడు. గది తలుపులు గడియ పెట్టుకొని రవి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మంటలకు కేకలు అరుపులు చేస్తున్నాడు. చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు.
ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, మూడు లక్షల అప్పు తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక గతంలో పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News