భారత్లో ఉగ్రకుట్ర వెనుక దావూద్ రైట్ హ్యాండ్ ‘మున్నా జింగాడా’!
ABN , Publish Date - May 31 , 2026 | 05:26 PM
దేశంలోని పలు కీలక ప్రాంతాలలో భారీ ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన తొమ్మిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర మూక వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
న్యూఢిల్లీ, మే 31: దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని పలు ప్రధాన నగరాలలో ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ), అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బట్టబయలైంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిన్న తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కుట్రకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దావూద్ ఇబ్రహీంకు అత్యంత నమ్మకస్తుడైన షూటర్, రైట్ హ్యాండ్ అయిన 'మున్నా జింగాడా' అలియాస్ 'సయ్యద్ ముదస్సర్ హుస్సేన్' భారత్పై మళ్లీ ఉగ్ర నెట్వర్క్ను యాక్టివేట్ చేసినట్లు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్న జింగాడాతో పాటు మరో ముగ్గురు హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే వీరు ఆయుధాలు సేకరించినట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి నిన్న ఢిల్లీ పోలీసులు భారీ పరిమాణంలో మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎవరీ మున్నా జింగాడా?
సయ్యద్ ముదస్సర్ హుస్సేన్ అలియాస్ మున్నా జింగాడా ముంబైలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందినవాడు. తొలినాళ్లలో ముంబైలోనే ఉంటూ దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ల కోసం పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు, హత్యలు చేశాడు. జింగాడా షూటింగ్ స్కిల్స్పై దావూద్కు ఎంత నమ్మకమంటే, తన శత్రువులను చంపే బాధ్యతను ఇతనికే అప్పగించేవాడు. గ్యాంగ్స్టర్ అరుణ్ గావ్లీపై దాడికి కూడా దావూద్ ఇతడినే ఉపయోగించినట్టు సమాచారం.
1997లో దావూద్ ఆహ్వానం మేరకు నేపాల్ మీదుగా పాకిస్తాన్లోని కరాచీకి చేరిన మున్నా, డి-కంపెనీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో, చోటా రాజన్పై దాడి చేసేందుకు దావూద్, జింగాడాను మహమ్మద్ సలీం అనే పేరుతో ఒక నకిలీ పాకిస్తానీ పాస్పోర్ట్పై బ్యాంకాక్కు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో బ్యాంకాక్లో దావూద్ ప్రధాన శత్రువు ఛోటా రాజన్పై హత్యాయత్నం చేశాడు. రాజన్ తృటిలో తప్పించుకోగా, అతని అనుచరుడు రోహిత్ వర్మ ఈ అటాక్ లో చనిపోయాడు. ఈ దాడి తర్వాత థాయ్లాండ్ పోలీసులు జింగాడాను అరెస్ట్ చేశారు. 2019లో థాయ్లాండ్ జైలు నుంచి విడుదలై, ఐఎస్ఐ సహాయంతో తిరిగి కరాచీ చేరుకుని భారత్పై ఉగ్ర చర్యలకు ప్లాన్ చేస్తున్నాడు.
భారత్-పాక్ మధ్య పౌరసత్వ వివాదం
జింగాడా బ్యాంకాక్ జైలులో ఉన్న సమయంలో అతనిని భారతదేశానికి అప్పగించాలని ముంబై పోలీసులు సుదీర్ఘ పోరాటం చేశారు. అతనిపై ముంబైలో హత్యలు, వసూళ్లు, గ్యాంగ్వార్లతో కూడిన సుమారు 70 కి పైగా తీవ్రమైన కేసులు ఉన్నాయి. అతను భారతీయ పౌరుడేనని నిరూపించడానికి భారత్ అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారాలను కూడా థాయ్లాండ్ కోర్టుకు సమర్పించింది. అయితే, అతనికి 'మహ్మద్ సలీం' అనే పేరుతో పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉండటంతో, అతను పాక్ పౌరుడేనని పాకిస్తాన్ వాదించింది. థాయ్ కింది కోర్టు భారత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, పాక్ అప్పీల్ చేయడంతో చివరకు థాయ్ కోర్టు అతడిని పాకిస్తాన్ పౌరుడిగా గుర్తించింది. 2019లో విడుదలయ్యాక అతను కరాచీ చేరుకున్నాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ నుంచే ఆపరేషన్స్
ఢిల్లీ పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం భారత్లో దొరికిన తొమ్మిది మంది సభ్యుల ఉగ్రవాద మాడ్యూల్ను పాకిస్తాన్ నుంచి నలుగురు ముఖ్య హ్యాండ్లర్లు నడిపిస్తున్నారని తెలుస్తోంది వీరిలో 1. మున్నా జింగాడా 2. దిలావర్ ఖాన్ 3. షహజాద్ భట్టి 4. అమీర్ జట్.. ఈ నలుగురూ ఐఎస్ఐ రక్షణలో కరాచీలో ఉంటూ స్థానిక యువతను బ్రెయిన్ వాష్ చేసి, ఆయుధాలు సరఫరా చేస్తూ భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు తేల్చారు. ఈ తొమ్మిది మంది ముఠా అరెస్టుతో దేశంలో జరగాల్సిన ఒక పెద్ద వినాశనం తప్పినట్లైంది.
ఇవి కూడా చదవండి..
మంత్రులు, డిప్యూటీ సీఎంలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మల్లికార్జున్ ఖర్గే
హిమాచల్ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా