ఐటీ రిటర్నులు ఈ-వెరిఫై చేసుకోండిలా..
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:59 AM
ఐటీ రిటర్నుల ఫైలింగ్ ముగిసింది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులు ఫైల్ చేసి ఉంటారు. అయితే మనం ఫైల్ చేసిన రిటర్న్ సరిగా ఉందా? లేదా? ఏమైనా తప్పులు ఉన్నాయి? అనే విషయాలను ఎలక్ట్రానిక్ (ఈ)-వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐటీ రిటర్నుల ఫైలింగ్ ముగిసింది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులు ఫైల్ చేసి ఉంటారు. అయితే మనం ఫైల్ చేసిన రిటర్న్ సరిగా ఉందా? లేదా? ఏమైనా తప్పులు ఉన్నాయి? అనే విషయాలను ఎలక్ట్రానిక్ (ఈ)-వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిటర్న్ ఫైల్ చేసిన నెల రోజుల లోపు ఈ-వెరిఫై పూర్తి చేయాలి. తప్పొప్పులు, తేడాలు ఉంటే వాటిని సవరించి నెల రోజుల లోపు మళ్లీ ఫైల్ చేయాలి. ఒకవేళ మీ రిటర్నులో తప్పులు, పొరపాట్లు ఉంటే ఐటీ శాఖ..ఆ రిటర్న్ను ఇన్వ్యాలిడ్ లేదా ఇన్కంప్లీట్ జాబితాలో పెట్టే ప్రమాదం ఉంది. అదే జరిగితే మీకు రావలసిన రిఫండ్ ప్రాసెస్ ప్రక్రియ కూడా ఆలస్యమవుతుంది.
ఈ-వెరిఫికేషన్ ఎలా?
ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్ incometax.gov.in కు వెళ్లి ‘ఈ-వెరిఫై రిటర్న్’పై క్లిక్ చేయాలి.
తరువాత మీ పాన్ నంబరు, అసెస్మెంట్ ఇయర్, అక్నాలెడ్జ్మెంట్ నంబరు ఎంటర్ చేయాలి.
ఒకవేళ అన్ని వివరాలు లేకపోతే పాన్ నంబరు, పాస్వర్డ్తో లాగిన్ అయి ‘మై అకౌంట్’లోకి వెళ్లి ‘ఈ-వెరిఫై రిటర్న్’పై క్లిక్ చేయాలి.
అప్పుడు ఈ-వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్నట్టు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మళ్లీ అక్కడ ఈ-వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు ఈ కింది మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
అవేంటంటే ?
ఈ-వెరిఫై చేసేందుకు నాకు ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ఉంది.
నా రిటర్న్ ఈ-వెరిఫై చేసేందుకు నా వద్ద ఈవీసీ లేదు. అప్పుడు ఈవీసీ జనరేట్ చేయాలి.
నా రిటర్న్ను ఈ-వెరిఫై చేసేందుకు నా ఆధార్ ఓటీపీ ఉపయోగించాలనుకుంటున్నాను.
ఈ పద్ధతిలో మీ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేస్తే.. మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది.
ఆధార్ ఓటీపీ..
ఆధార్తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా చేయవచ్చు.
నెట్ బ్యాంకింగ్..
నెట్ బ్యాంకింగ్తో జనరేట్ అయిన ఈవీసీని ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదైన మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ ద్వారా చేయవచ్చు.
బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ఖాతా ఈవీసీ..
ప్రీవ్యాలిడేటెడ్, ఈవీసీ ఎనేబుల్డ్ బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ఖాతాల ద్వారా జనరేట్ అయిన ఈవీసీని ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదైన మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీలకు పంపించడం ద్వారా చేయవచ్చు.
ఈ-వెరిఫికేషన్కు వేరే మార్గాలు
వేరే మార్గాల ద్వారానూ మీ ఐటీ రిటర్న్ను ఈ-వెరిఫై చేసుకోవచ్చు. అదెలాగంటే?
జూనెట్ బ్యాంకింగ్ పోర్టల్లో లాగినై, ఈ-వెరిఫై ఐటీఆర్ సెగ్మెంట్లో చూసుకోవచ్చు.
లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఆదార్ ఓటీపీతో, ఆధార్ను మ్యాప్ చేయడం ద్వారా కన్ఫార్మ్ చేసుకుని, మీ రిటర్న్ను ఈ-వెరిఫై చేసుకోవచ్చు.
ఒకవేళ ఆఫ్లైన్ ప్రాసెస్లో వెరిఫై చేసుకోవాలంటే బ్యాంకు ఏటీఎంలో మీ ఈవీసీ ఎంటర్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఐటీఆర్-5ను ఆఫ్లైన్లో వెరిఫై చేసుకోవాలంటే...సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ), ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు-560500, కర్ణాటక, అనే చిరునామాకు నిర్ణీత ఫారంలో పంపించాలి. ఈ ఐటీఆర్-5ను స్పీడ్ పోస్టు ద్వారా బెంగళూరులోని సీపీసికి పంపించినట్టయితే, సీపీసీకి అందిన తేదీ నుంచి నెలలోపు ఈ-వెరిఫికేషన్ అడగాలి. అయితే ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన వ్యక్తి (అసెసీ) అనుమతి పొందిన వ్యక్తి లేదా వారి ప్రతినిధి ఈ పద్ధతుల్లో మన ఐటీ రిటర్న్ను ఈ-వెరిఫై చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: షాట్పుట్లో భారత్కు రెండు పతకాలు
నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..