Share News

కారు బ్యానెట్‌పై ఎగిరిపడ్డ టీడీపీ కార్యకర్త

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:35 AM

కదులుతున్న కారు బ్యానెట్‌పై వ్యక్తి పడినా ఆపకుండా, దూసుకెళ్లిన వైనం చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపింది. మూడు కిలో మీటర్ల మేర వెళ్లాకగానీ కారు ఆగింది కాదు. ఈ వ్యవహారంలో వైసీపీ జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులుపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

కారు బ్యానెట్‌పై ఎగిరిపడ్డ టీడీపీ కార్యకర్త

  • ఆపకుండా దూసుకెళ్లిన వైసీపీ జడ్పీ చైర్మన్‌

  • ప్రాణభయంతో వణికిపోయిన బాధితుడు

  • శ్రీనివాసులుపై కుప్పం పోలీసులకు ఫిర్యాదు

రామకుప్పం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): కదులుతున్న కారు బ్యానెట్‌పై వ్యక్తి పడినా ఆపకుండా, దూసుకెళ్లిన వైనం చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపింది. మూడు కిలో మీటర్ల మేర వెళ్లాకగానీ కారు ఆగింది కాదు. ఈ వ్యవహారంలో వైసీపీ జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులుపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కుప్పంలో మంగళవారం జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ భరత్‌తో పాటు జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. సమావేశం అనంతరం తన స్వస్థలం వి.కోటకు జడ్పీ చైర్మన్‌ బయలుదేరారు. అంతలోనే ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దానిని చూసిన శాంతిపురం మండల టీడీపీ నేతలు నాయనపల్లె వద్ద ఎదురుగా వస్తున్న జడ్పీ చైర్మన్‌ కారును ఆపారు. అలా మాట్లాడటంపై నిలదీయాలని భావించారు. ఇంతలోనే కారును పోనివ్వాలని జడ్పీ చైర్మన్‌ సైగ చేయడంతో డ్రైవరు ముందుకు కదిలించాడు. ఆ సమయంలో కారు ముందున్న రామకుప్పం మండలం సాకల కుప్పానికి చెందిన సురేశ్‌ ఆ కారు బ్యానెట్‌పైకి ఎగిరిపడ్డాడు. అయినా, డ్రైవరు కారు ఆపకుండా వెళ్లాడు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం కారు అద్దాల వైపర్‌లను పట్టుకుని సురేష్‌ భయాందోళనతో ఉండిపోయాడు.


రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె సమీపంలో కారు ఆపడంతో సురేశ్‌ కిందకు దిగి వెళ్లిపోయారు. దీనిపై జడ్పీ చైర్మన్‌, ఆయన అనుచరులపై రాళ్లబూదుగూరు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తాను కారు దిగగానే.. జడ్పీ చైర్మన్‌తో పాటూ అతని అనుచరులు దుర్భాషలాడుతూ, తన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. కాగా, నాయనపల్లె వద్ద టీడీపీ కార్యకర్తలు తన కారును అడ్డుకుని దాడికి ప్రయత్నించారంటూ జడ్పీ చైర్మన్‌ ఆరోపించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వారు కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్‌ చాకచక్యంగా కారును ముందుకు తీసుకెళ్లినా వారు కొంత దూరం వెంబడించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 89 పెద్దూరు ఎంపీటీసీ వెంకటరమణపైనా టీడీపీ వారు దాడి చేసి, ఆయన కారు అద్దాలు పగులగొట్టారంటూ వైసీపీ సోషల్‌ మీడియాలో ఫొటోలు హల్‌చల్‌ చేశాయి.

ఈ వార్తలనూ చదవండి...

పడక గది ప్రశాంతంగా...

‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’

Updated Date - Sep 09 , 2026 | 04:35 AM