పోలవరం ఆర్అండ్ఆర్ భూసేకరణలో అక్రమాలపై ఉక్కుపాదం.. దళారులను హెచ్చరించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:48 PM
పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న భూసేకరణ, పరిహారం ప్రక్రియలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరించారు. భూసేకరణ పరిహారం విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని నిర్వాసితులకు ఆయన సూచించారు.
పోలవరం జిల్లా: పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న భూసేకరణ, పరిహారం ప్రక్రియలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరించారు. భూసేకరణ పరిహారం విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని నిర్వాసితులకు ఆయన సూచించారు. తన పేరు వాడుకుని నకిలీ పత్రాల ద్వారా పరిహారం పొందేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు, దళారులు సహా ఎవరు అక్రమాలకు పాల్పడినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో భూసేకరణ, పరిహారం పంపిణీకి సంబంధించిన ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చిర్రి బాలరాజు తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారం ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన వారికి మాత్రమే చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రికార్డులు, భూమి హక్కులకు సంబంధించిన పత్రాలను పరిశీలించి పారదర్శకంగా పరిహారం అందించేలా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు.
మరోవైపు, భూసేకరణ పరిహారాన్ని కూటమి ప్రభుత్వం 10 శాతం పెంచిందని ఎమ్మెల్యే తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన నిజమైన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొప్పర్తి-కడప బైపాస్ రహదారికి రూ.304.44 కోట్లు.. కేంద్రానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు..
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన