శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలు తయారు చేయాలి: ఏపీ గవర్నర్..
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:54 PM
భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు గవర్నర్ తెలిపారు.
ఏలూరు: భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్-జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. గౌర్మెట్ పాప్కార్నికా ఫ్యాక్టరీ వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 70 శాతం మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని అన్నారు. దీంతో అందుకు సంబంధించిన నగదు మొత్తం ఆయా దేశాలకు వెళ్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొత్తం మన దేశ రైతులకు వస్తోందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఏలూరులో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్కు మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా ముసునూరుకు చేరుకున్నారు.
మరోవైపు, ఈ కార్యక్రమంపై ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘భారత గౌరవ ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు ఏలూరులో స్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. భారతదేశపు మొట్టమొదటి నాన్-జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ కార్యక్రమంలో వారితో కలిసి పాల్గొనడానికి ఎదురుచూస్తున్నాం. ఇది మన రైతులకు నూతన ఆవిష్కరణలు, అధిక విలువ సృష్టించే దిశగా ఓ కీలక ముందడుగు’ అంటూ పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
20వేల మంది జెన్జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలు తయారు చేయాలి: ఏపీ గవర్నర్..