రాజమండ్రి కల్తీ పాల మిస్టరీ వీడింది.. పాలలో కలిసిన ఆ 'విషమే' ప్రాణాలు తీసింది
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:09 PM
రాజమండ్రిలో కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురి మరణాలకు సంబంధించి తుది రిపోర్టును శనివారం అధికారులు వెల్లడించారు.
అమరావతి, మార్చి 7: రాజమండ్రిలో(Rajahmundry) కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Lab) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురి మరణాలకు సంబంధించిన FSL, RFSS ల్యాబ్ల నుంచి వచ్చిన తుది రిపోర్టు(Final report)ను శనివారం అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ‘EG-ఇథైలిన్ గ్లైకాల్’ (Ethylene Glycol) అనే విషపూరిత కెమికల్ కలిసినట్లు నిర్ధారణ అయ్యింది. రసాయనాలు కలిసిన కల్తీ పాలను తాగడం వల్ల బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని (Kidney Failure), వారు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు ‘వరలక్ష్మి పాల కేంద్రం’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్ లీక్ అవ్వడంతో, ఆ ప్రదేశంలో ఎం-సీల్ (M-Seal)తో అతికించాడు. అయితే, గత నెల 15వ తేదీన పాల కేంద్రంలోని పాలు చేదుగా ఉన్నాయని కొంతమంది ఖాతాదారులు ఫిర్యాదు చేసినప్పటికీ, వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరుసటి రోజు కూడా అవే పాలను రాజమండ్రిలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేశాడు. ఫ్రీజర్ నుంచి లీక్ అయిన రసాయనాలు పాలలో కలవడం వల్లే అవి విషతుల్యంగా మారినట్టు దర్యాప్తులో తేలింది.
పోలీసులు అక్కడ ఉన్న ఫ్రిజర్తో పాటు ఇతర పదార్ధాలను స్వాధీనం చేసుకొని ల్యాబ్కు పంపగా ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. గత నెల 16న ఈ కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన 20 మందిలో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. మిగిలిన 10 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణానికి బాధ్యుడైన అడ్డాల గణేశ్వరరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆయనపై 9 కేసులు నమోదయ్యాయి. డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
నేటితో ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ