తెలియదు.. గుర్తులేదు.. మరచిపోయా!
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:18 AM
‘తెలియదు.. గుర్తులేదు.. మరచిపోయా’.. ఇదీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ పోలీసుల విచారణలో ఇచ్చిన సమాధానం.
పోలీసుల విచారణలో తమ్మినేని వాణిశ్రీ
ప్రతి శనివారం స్టేషన్కు రావాలి: పోలీసులు
శ్రీకాకుళం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ‘తెలియదు.. గుర్తులేదు.. మరచిపోయా’.. ఇదీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ పోలీసుల విచారణలో ఇచ్చిన సమాధానం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపించి.. చాపురంలో రూ.4 కోట్ల విలువైన భూమిని తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ఘటనపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో తమ్మినేని సీతారాం, వాణిశ్రీ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసు విచారణను రూరల్ పోలీసులు ఇటీవలే విచారణ చేపట్టి, తమ్మినేని సీతారాంను విచారించారు. తాజాగా శనివారం తమ్మినేని వాణిశ్రీని విచారించారు. ఎస్ఐ కరణం వెంకట సురేశ్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వాణిశ్రీని విచారించారు. ‘ప్రైవేటు భూమి కొనుగోలుకు డబ్బులు ఎలా చెల్లించారు? రిజిస్ట్రేషన్కు ఎవరు సహకరించారు? మీ అబ్బాయి పేరుతోనే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు? ఈ వ్యవహారంలో మీకు తెలిసిన వాస్తవాలు చెప్పండి అని ఎస్ఐ ప్రశ్నించగా.. ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా..’ అని ఆమె సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పగా.. ‘కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తా’ అని వాణిశ్రీ స్పష్టం చేశారు. కాగా, హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన సీతారాం, వాణిశ్రీ దంపతులు.. బెయిల్కు సంబంధించిన రూ.50వేల బాండు పేపర్లు, పూచీకత్తులను స్టేషన్లో అందజేశారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు