హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:44 PM
హైదరాబాద్లో ఆగస్టు 30న నిర్వహించనున్న రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 4:30 నుంచి 9:30 గంటల వరకూ పలు ప్రధాన మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 29: నగరంలో ఆగస్టు 30న నిర్వహించనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు. ఉదయం 4:30 గంటల నుంచి 9:30 గంటల వరకూ మారథాన్ జరిగే మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పీపుల్స్ ప్లాజా నుంచి జీఎంసీ బాలాజీ స్టేడియం, గచ్చిబౌలి వరకు నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 45 మీదుగా మారథాన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ వైపు మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు.
పంజాగుట్ట, రాజ్భవన్ వైపు వెళ్లే వాహనాలను షాదాన్–రవీంద్రభారతి మార్గంలో మళ్లించనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నంబర్ 10, 12–క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. లిబర్టీ, కర్బాలా, ముషీరాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలకు కూడా పలు ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయి.
బేగంపేట నుంచి రాజ్భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలను గ్రీన్లాండ్స్ వద్ద మళ్లించనున్నారు. పంజాగుట్ట ఫ్లైఓవర్, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్ వద్ద కూడా ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వాహనదారులు ఉదయం 4:30 నుంచి 9:00 గంటల మధ్య ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
సినిమా సీన్ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్ను..
కొడుకు కోసం చేతిపై కీబోర్డ్ ట్యాటూ వేయించుకున్న తల్లి.. కారణం ఏంటంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..