గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:15 PM
అమరావతిలో పర్యావరణ పరిరక్షణపై ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. చెట్లను నరికే సంస్కృతి కాదని, మొక్కలు నాటి పచ్చదనం పెంచే సంస్కృతి తమదని స్పష్టం చేశారు.
అమరావతి, ఆగస్టు 29: గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదని అన్నారు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాగబాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చెట్లను నరికివేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని.. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలనే ఆలోచన కనిపించలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వానిది నరికే సంస్కృతి కాదని.. నాటే సంస్కృతి అని స్పష్టం చేశారు. భూమాతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రకృతి పరిరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించాలని నాగబాబు పేర్కొన్నారు. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి.. ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని అన్నారు. అశ్వత్థ నారాయణ వివాహం కార్యక్రమం ప్రకృతి.. ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనంగా నిలిచిందని నాగబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అరణ్యారామంలో నాగబాబు తన సతీమణితో కలిసి రావి, వేప మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశం ప్రకృతి సంరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలి. మన సంప్రదాయాల్లో చెట్లను దైవ స్వరూపంగా భావిస్తాం. వాటి పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. రావి, వేప వంటి పర్యావరణపరంగా ప్రాధాన్యత కలిగినవి. మొక్క నాటడం మాత్రమే కాకుండా.. అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించడమే అసలైన పర్యావరణ సేవ’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎన్జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..
నేపాల్కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. కొత్తగా రెండు హిమ సరస్సుల గుర్తింపు..