Share News

స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీ ఉద్యోగుల నిరనస

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:05 AM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీల ఉద్యోగులు కదం తొక్కారు. గత మూడు రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీ ఉద్యోగుల నిరనస

  • విశాఖ బస్టాండ్‌ కూడలిలో రోడ్డుపై బైఠాయింపు

  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

సిరిపురం(విశాఖపట్నం), సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్వర్ణ వార్డు/స్వర్ణ పంచాయతీల ఉద్యోగులు కదం తొక్కారు. గత మూడు రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జోన్‌-1 పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు.. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీక్షా శిబిరం నుంచి ఎల్‌ఐసీ రోడ్డు కూడలికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్డులో మరికొంతమంది ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ తమకు రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలని, తొమ్మిది నెలల అరియర్స్‌ చెల్లించాలని, ప్రొబేషన్‌ ఆలస్యమైన కాలానికి ఇంక్రిమెంట్‌ కలిపి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఉద్యోగి మూలవేతనం రూ.30 వేలకు తగ్గకుండా ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలన్నారు. జీవోఎంస్‌ నంబరు 11ను వెంటనే రద్దుచేయాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు దక్కాల్సిన ప్రయోజనాలు చెల్లించి కారుణ్య నియమాకాలు చేపట్టాలని కోరారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సెల్‌లో సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఆర్డీవో దిలీప్‌ చక్రవర్తి ఘటన స్థలికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. అయితే, కలెక్టర్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఉద్యోగులు నిరసనను కొనసాగిస్తున్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్‌

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

Updated Date - Sep 07 , 2026 | 06:05 AM