Share News

అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:21 PM

వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు.

అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

మార్కాపురం, జూన్ 27: వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు. ఈరోజు(శనివారం) జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. 3 వంట గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని.. ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలకు అన్నీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగాయని.. ప్రైవేటు స్కూళ్ల నుంచి లక్ష మంది ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు.


ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు..

అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకొచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. ఎవరికైనా ఆరోగ్యం ఉంటేనే ఆనందమని.. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామన్నారు. మన మిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సంజీవని పథకం ఒక గేమ్‌ ఛేంజర్‌ అని అన్నారు. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘భవిష్యత్తులో పిల్లలే మన ఆస్తి. ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతోంది’ అని అన్నారు. ప్రతిఒక్కరూ క్వాంటమ్‌, Ai నేర్చుకోవాలని సూచించారు.


నదుల అనసంధానం నా జీవిత లక్ష్యం..

ఏపీకి పోలవరం జీవనాడి అని ముఖ్యమంత్రి తెలిపారు. వైసీపీ హయాంలో పోలవరాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. పనులు పూర్తికాకుండానే వెలిగొండను జాతికి అంకితం చేశారన్నారు. దిక్కుమాలిన పార్టీ.. గొడ్డలి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. కుక్కతోక వంకర అన్నట్లు.. వైసీపీ బుద్ధి ఇంకా మారలేదన్నారు. ఇప్పుడు మావిగన్‌ అంటున్నారంటూ ఫైర్ అయ్యారు. అమరావతిపై వైసీపీ కుట్రలు ఆగడంలేదన్నారు. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట అంటూ వ్యాఖ్యానించారు. మన రాజధాని అమరావతి అని కాలర్‌ ఎగరేసే పరిస్థితి తీసుకొస్తామన్నారు. అమరావతిని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. నదుల అనసంధానం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. నీటి సమస్యలను అన్ని రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు. నదుల అనుసంధానమే అన్ని రాష్ట్రాలకు శ్రీరామ రక్ష అని తెలిపారు.


గొడ్డలి పార్టీ వల్ల చేటే..

వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సాయికృష్ణ కేసు అంశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను లాగి కుట్రలు చేయాలని చూశారని ఆరోపించారు. హోం మంత్రి అనితను ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ‘మహిళల మేకప్‌ గురించి మాట్లాడతారా? ఆడబిడ్డలను అవమానిస్తారా? హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరిరోజు. రాజకీయాలకు అర్హత లేని పార్టీ.. గొడ్డలి పార్టీ. ఎప్పటికైనా ఏపీకి గొడ్డలి పార్టీ వల్ల చేటే’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు

ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకల దాడే: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 04:47 PM