Share News

వాన్‌పిక్‌ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:17 AM

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నాటి వాన్‌పిక్‌ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో రస్‌ అల్‌ ఖైమా ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (రాకియా) పేరు మీద మరో రూ.200 కోట్లను అదనపు సెక్యూరిటీ డిపాజిట్‌గా జమచేయాలని ఆయనను, మరో నాలుగు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

వాన్‌పిక్‌ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు

  • ‘రస్‌ అల్‌ ఖైమా’కు మరో రూ.200 కోట్లు

  • డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

  • యూఏఈ కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నాటి వాన్‌పిక్‌ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో రస్‌ అల్‌ ఖైమా ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (రాకియా) పేరు మీద మరో రూ.200 కోట్లను అదనపు సెక్యూరిటీ డిపాజిట్‌గా జమచేయాలని ఆయనను, మరో నాలుగు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. నిమ్మగడ్డ, ఇతరులు రాకియా సంస్థకు రూ.950కోట్లు చెల్లించాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కోర్టు ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా తాజా ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జమానాలో వాన్‌పిక్‌ ప్రాజెక్టు (వాడరేవు అండ్‌ నిజాంపట్నం పారిశ్రామిక కారిడార్‌) మొగ్గ తొడిగింది.


నిమ్మగడ్డ ప్రసాద్‌ నేతృత్వంలోని మ్యాటిక్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 49శాతం, రాకియా 51శాతం వాటాతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందుకోసం అప్పటి గుంటూరు, ప్రకాశం జిల్లాల తీరప్రాంతంలో దాదాపు 13,221 ఎకరాలు సేకరించారు. ప్రాజెక్టులో భాగంగా రూ.16,000 కోట్ల నుంచి రూ.17,000 కోట్ల పెట్టుబడులతో నౌకాశ్రయం, పెద్ద పారిశ్రామిక సముదాయం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ భూసేకరణ తీరుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. వైఎస్‌ ఆకస్మిక మరణం తర్వాత వాన్‌పిక్‌ ప్రాజెక్టు భూసేకరణ లొసుగులన్నీ బయట పడ్డాయి. వాన్‌పిక్‌ వ్యవహారంలో వైఎస్‌ కుమారుడు జగన్‌తో అంటకాగిన నిమ్మగడ్డ ప్రసాద్‌కు కొన్నాళ్ల పాటు జైలు జీవితం తప్పలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే యూఏఈ కంపెనీ రాకియా ఈ ప్రాజెక్టు కోసం తాము పెట్టిన పెట్టుబడులను దుర్వినియోగం చేశారని ఆ దేశంలోని కోర్టులను ఆశ్రయించి, రూ.950 కోట్లకు డిక్రీ తెచ్చుకుంది. ఈ ఆదేశాలను అమలు చేయాలని భారత సుప్రీంకోర్టునూ ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు ఇంతకు ముందే రూ.212 కోట్లు డిపాజిట్‌ చేయాలని నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఆదేశించింది. ఇప్పుడు దానికి మరో రూ.200 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 05:17 AM