పోరంబోకులో ప్రహరీ తొలగింపు
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:50 PM
యారబాడులోని అంగన్వాడీ కేంద్రం పక్కన గల పొలాలకు వెళ్లే పోరంబోకు గోర్జి ఆక్రమణకు గురి కావడంతోపాటు అడ్డుగా ప్రహరీ నిర్మించారన్న ఫిర్యాదుమేరకు మంగళవారం రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో తొలగించారు.
నరసన్నపేట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): యారబాడులోని అంగన్వాడీ కేంద్రం పక్కన గల పొలాలకు వెళ్లే పోరంబోకు గోర్జి ఆక్రమణకు గురి కావడంతోపాటు అడ్డుగా ప్రహరీ నిర్మించారన్న ఫిర్యాదుమేరకు మంగళవారం రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో తొలగించారు. నాలుగు నెలల కిందట గ్రామంలో సర్వేనెంబరు 53/7లోని పోరంబోకు స్థలంలో పొలాలకు వెళ్లే గోర్జిని ఆక్రమించి అడ్డుగా ప్రహరీ నిర్మిస్తున్నట్లు ఫిర్యాదురావడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేసి తొలగించాలని కోరారు. అయితే తొలగించకపోవడంతో మంగళవారం పోలీసుల సమక్షంలో యంత్రాలతో గోడను తొలగించామని తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ తెలిపారు. 1961కు పూర్వం సంబందిత ప్రాంతం జిరాయితీ అని, 1961లో చేపట్టిన భూసర్వే అనంతరం పోరంబోకు స్థలంగా రికార్డుల్లో నమోదు కావడంతోనే ఆ ప్రాప్తికి పోరంబోకు స్థలంలో ఆక్రమణలను తొలగించామని తహసీల్దార్ తెలిపారు. కక్షపూరితంతోనే కూటమి నాయకులు తొలగించారని, తనకు సంబందిత స్థలంపై హక్కులు ఉన్నాయని ఎన్ని రాజులమ్మ చెబుతోంది. కాగా పలు గ్రామాలు నుంచి వైసీపీ నాయకులు అక్కడకు చేరుకొని తొలగింపును అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. దీంతో నరసన్నపేట, పోలాకి ఎస్ఐలు గణేష్, రంజిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అక్రమనిర్మాణాలను తొలగించేందుకు అడ్డుకున్న వారిని పక్కకు తప్పించడంతో రెవెన్యూఅధికారులు ప్రహరీని తొలగించారు.గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పహరా నిర్వహించారు.