చంద్రశేఖర్ తీరు మార్చుకో.. లేదంటే రాజకీయంగా నష్టం తప్పదు: రూప్ కుమార్
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:06 PM
వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మంత్రి నారాయణకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నెల్లూరు, ఏప్రిల్ 21: వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మంగళవారం మీడియాతో డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి నారాయణకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రూ.20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్నారని వివరించారు.
ఏడాది కాలంగా దాని నిర్వహణ కోసం మంత్రి కుటుంబం రూ.2.5 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ మేయర్ చెప్పారు. పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడానికి 10 వేల సైకిళ్లు సిద్ధం చేస్తోందని తెలిపారు. విద్యాసంస్థల ద్వారా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోట్లు సంపాదించారని ఆరోపించారు. సేవలో పోటీ పడితే బాగుంటుందని ఎమ్మెల్సీకి హితవుపలికారు. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలని.. ప్లాంటేషన్ పాలిటిక్స్ ఇప్పటికైనా మానాలని సూచించారు.
‘మొక్కే కదా..! అని మీరు పీకేస్తే చూస్తూ ఊరుకోవాలా? అభివృద్ధి నిరోధకులపై కేసులు పెడితే తప్పా?’ అని డిప్యూటీ మేయర్ ప్రశ్నించారు. ప్లాంటేషన్కు సంబంధించి ఏ వివరాలు కావాలన్నా పక్కాగా ఇస్తామని తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి తీరు మార్చుకోకపోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందం.. ఆధునిక పరిపాలనపై అధ్యయనం
Read Latest AP News And Telugu News