కోర్టులు మొట్టికాయలు వేసినా.. వైసీపీ నేతల తీరు మారడం లేదు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:46 AM
వైసీపీ గొడ్డలి పార్టీ అని.. అందులోని వారంతా సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. వారి తీరు మారడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నెల్లూరు, ఆగస్టు 08: వైసీపీ గొడ్డలి పార్టీ అని.. అందులోని వారంతా సైకోల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ మండిపడ్డారు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. వారి తీరు మారడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతల తీరును ఈ సందర్బంగా ఎండగట్టారు. శనివారం నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి? అని వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. 16 వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినందుకా? అని వైసీపీ నేతలను నిలదీశారు. త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని ఈ సందర్బంగా మంత్రి నారాయణ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఓర్వలేకపోతున్నారంటూ వైసీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.
వైసీపీ నేతలు చేస్తున్న నిరసన దీక్షలను సొంత పార్టీలోని వారే వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. ఆ దీక్షల్లో అభ్యర్ధులు ఎవరూ పాల్గొలేదని చెప్పారు. మావిగన్ అంశంపై ఇప్పటికీ సొంత పార్టీలోని వారంతా నవ్వుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రపంచ స్థాయిలో నిర్మితమైందని వివరించారు. ఆ అంశాన్ని పక్క దారి పట్టించేందుకే ఇప్పుడీ దీక్షలు అంటూ వైసీపీ నేతల తీరును మంత్రి నారాయణ ఎండగట్టారు.