కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:14 PM
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుగులలో ఘోర విషాదం సంభవించింది. కోళ్ల గూటి వద్ద పాముకాటుకు గురై రామ్ చరణ్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
నంద్యాల, జులై 2: జిల్లాలోని కొత్తపల్లి మండలం పాత మాడుగుల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పాముకాటుకు గురై రామ్ చరణ్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. రాత్రి సమయంలో కోళ్లు గట్టిగా అరుస్తుండటంతో, ఏం జరిగిందోనని చూసేందుకు రామ్ చరణ్ కోళ్ల గూటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పాము బాలుడిని కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎర్రమఠం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లిన సమయంలో ఆసుపత్రిలో కనీసం ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేడని, దీంతో బాలుడికి సకాలంలో వైద్యం అందలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాత మాడుగుల గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా? వీడియో వైరల్
వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!