రాష్ట్రానికి మజగావ్ డాక్!
ABN , Publish Date - Sep 16 , 2026 | 04:37 AM
ప్రఖ్యాత షిప్బిల్డింగ్ సంస్థ మజగావ్ డాక్ ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో రూ.15,000 కోట్ల పెట్టుబడితో షిప్బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 20న సీఎం చంద్రబాబు సమక్షంలో పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
15 వేల కోట్లతో దుగరాజపట్నంలో షిప్బిల్డింగ్ యూనిట్
ఈనెల 20న సీఎం సమక్షంలో ఎంఓయూకు అవకాశం
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఓడరేవుల అభివృద్ధిలో ప్రఖ్యాతిగాంచిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. 15 వేల కోట్లతో దుగరాజపట్నంలో షిప్బిల్డింగ్ యూనిట్ నిర్మాణానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ఈనెల 20న సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగే అవకా శం ఉంది. మజగావ్ డాక్ను రాష్ట్రానికి తీసుకురావడానికి కూటమి ప్ర భుత్వం ఎంతో కృషి చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో గతంలో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, నేషనల్ షిప్బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్కు మహారాష్ట్ర లిమిటెడ్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు మహారాష్ట్రలో మజగావ్ రూ. 27,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది. ఈనేపథ్యంలో మజగావ్ డాక్తో ఏపీ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్ను స్థాపించాలన్న ప్రతిపాదనకు మజగావ్ ఆమోదం తెలిపింది. అయితే.. మజగావ్తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల సమాచారం తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. బయట రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టకూడదని, తమ రాష్ట్రంలోనే విస్తరణను చేపట్టాలని చెప్పింది. అయితే.. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంలో రాష్ట్రం వెలుపల కూడా తమ కార్యకలాపాలను విస్తరించుకుంటామని మజగావ్ స్పష్టంగా పేర్కొంది. ఇందుకు మహారాష్ట్ర అంగీకరించి సంతకాలూ చేసింది. దీంతో.. ఏపీలో మజగావ్ పెట్టుబడులకు మహారాష్ట్ర అడ్డుచెప్పే వీల్లేకుండా పోయింది. మజగావ్తో మంగళవారం రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ సంప్రదింపులు జరిపింది. ఈనెల 20న సీఎం చంద్రబాబు అందుబాటులో ఉంటే.. ఆయన సమక్షంలో మజగావ్తో రూ.15,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాలపై సంతకాల కార్యక్రమాన్ని చేపట్టే యోచనలో అధికారవర్గాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కరువు నేలపై కొత్త వెలుగు
కొలువుల జాతర
Read Latest Telangana News And AP News And National News
And Telugu News