వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపరాఫర్
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:37 PM
వైసీపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అధ్యక్షుడి స్థానం నుంచి జగన్ను మార్చాలనుకునే వైసీపీ నేతలకు తాను ఆర్ధికంగా సహాయం చేస్తానని అన్నారు..
కర్నూలు: వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపరాఫర్ ప్రకటించారు. కర్నూలులో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే.. 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కే అవకాశం ఉంటుందని సూచించారు. వైసీపీ అధ్యక్షుడిని మార్చాలని భావిస్తున్న నాయకులకు తాను ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని టీజీ భరత్ తెలిపారు.
ఇటీవల జరిగిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై కూడా మంత్రి స్పందించారు. ఈ ఘటన వెనుక పలు కుట్రలు దాగి ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. జగన్ తిరుపతికి వెళ్లి తన పాలనలో తప్పులు జరిగాయని అంగీకరించి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీవారిని క్షమాపణ కోరితే ఈ వివాదం ఇంత పెద్దది అయ్యేదే కాదని వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కూడా టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో కొనసాగుతుందని, ఇటీవల ఒక ఐఏఎస్ అధికారి కూడా 2039 వరకూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని తనతో చెప్పారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..
వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు
Read Latest AP News