నంద్యాలలో ఫుడ్ పాయిజన్.. 60 మందికి అస్వస్థత
ABN , Publish Date - Mar 24 , 2026 | 10:24 AM
నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. వివాహంలో మిగిలిన ఆహారాన్ని బుడగ జంగాల కాలనీ వాసులకు పెళ్లి తరఫు వారు పంచిపెట్టారు. అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
నంద్యాల, మార్చి24: నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. వివాహంలో మిగిలిన ఆహారాన్ని బుడగ జంగాల కాలనీ వాసులకు పెళ్లి తరఫు వారు పంచిపెట్టారు. ఈ ఆహారాన్ని తిన్న కాలనీలోని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. బాధితుల్లో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఇది ఫుడ్ పాయిజనా? లేకుంటే.. తాగు నీటిలో ఏమైనా తేడా ఉందా? అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ ఘటనపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు స్పష్టం చేశారు. బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా వారికి అధికారులు భరోసా ఇచ్చారు.
ఘటనపై మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా..
నంద్యాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ స్థానిక వైద్యాధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ జిల్లా ఉన్నతాధికారులను మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతిపై ఎవరు కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత
నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ
For More AP News And Telugu News