బనగానపల్లె పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 09 , 2026 | 09:49 PM
వందల మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈరోజు (గురువారం) బనగానపల్లె పర్యటనపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
నంద్యాల జిల్లా: వందల మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు (గురువారం) బనగానపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన పర్యటనపై ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి స్పందించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. నేడు వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి.. అన్నదాతల కళ్లల్లో ఆనందం చూశామన్నారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. 'నంద్యాల జిల్లా పర్యటనలో వందల మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో 22-ఏ జాబితాలో చిక్కుకుని అనేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న బేతంచర్ల మండలం గుటుపల్లి రైతుల సమస్యకు పరిష్కారం చూపాం. గత పర్యటనలో వారికి ఇచ్చిన మాట ప్రకారం, గుటుపల్లిలో 2,074ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను నేడు బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో స్వయంగా పర్యవేక్షించా. నేడు 897మంది రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభించాయి.

అలాగే, బనగానపల్లె నియోజకవర్గంలోని మరో 23మంది రైతులకు చెందిన 101ఎకరాల చుక్కల భూములనూ క్రమబద్ధీకరించి న్యాయం చేశాం. ప్రజలు ప్రాణంగా భావించే భూములపై వారికే హక్కులు కల్పించాం. సమస్యలను పరిష్కరించి వారి ఆస్తులకు భద్రత, జీవితాలకు భరోసా కల్పిస్తున్నాం. 2027 మార్చి నాటికి భూముల రీ-సర్వే 2.0 పూర్తి చేసి, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నాం' అంటూ పోస్టు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ కేబినెట్ భేటీలో రైతులకు శుభవార్త.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్!
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్