కర్నూలులో రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన
ABN , Publish Date - Sep 05 , 2026 | 03:36 PM
ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలో రూ. 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
కర్నూలు, సెప్టెంబరు 5: జిల్లాలోని మార్కెట్ యార్డులో రూ. 50 లక్ష్లల వ్యయంతో చేపడుతున్న షెడ్ నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జిల్లాలో మొత్తం రూ. 2 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రైతుల సౌకర్యార్థం జిల్లా మార్కెట్ యార్డులో నూతన షెడ్ నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి తెలిపారు. దీంతో పాటు రానున్న రోజుల్లో యార్డులో 30 నుంచి 40 వరకు కొత్త షాపులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతుల కృషి వల్లే ఈ ఏడాది మార్కెట్ యార్డు ఆదాయం రూ. 8 కోట్లకు పెరిగిందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గతంలో ఉల్లిధరలు పడిపోయిన సమయంలో సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రైతులకు అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కర్నూలు నగరంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.
మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి..
వినాయక చవితి నేపథ్యంలో ప్రజలు ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి భరత్ కోరారు. కేసీ కెనాల్, సుంకేసులలో నీటి లభ్యత లేని కారణంగా పెద్ద విగ్రహాలు పెడితే నిమజ్జనం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని చిన్నచిన్న వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పర్యావరణానికి హాని చేకూరని విధంగా మట్టివిగ్రహాలను పూజించాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. హైపవర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే టీచర్లకు గొప్ప గుర్తింపు: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telugu News