Supreme Court: వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసిన సునీతా రెడ్డి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:16 PM
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ, జనవరి 13: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (Viveka Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తుపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి.. సుప్రీంలో అప్లికేషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో పరిమితంగా, పాక్షికంగా సీబీఐ దర్యాప్తునకు ట్రయల్ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను సునీతా రెడ్డి ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు పాక్షికంగా మాత్రమే సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వడం, కేవలం ఇద్దరి పాత్రలపైనే విచారణ జరపాలని ఆదేశించడం వంటి అంశాలను.. సునీత తన అప్లికేషన్ లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రయల్ కోర్టు విచారణ జరపలేదని, తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక ఆదేశాలు ఇచ్చారని ఆమె తెలిపారు. దీంతో తాజా అప్లికేషన్ తోపాటు పాత పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనం ఈనెల 20కి వాయిదా వేసింది.
గతంలో సీబీఐ విచారణ కొనసాగించే అంశంపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు.. సుప్రీం ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను పాటించకుండా ట్రయల్ కోర్టు పాక్షిక ఆదేశాలు ఇవ్వడం సరికాదని సునీత తరఫు న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సునీత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణ జరిపి, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (జనవరి 20) వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
కైట్ ఫెస్టివల్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
Read Latest AP News And Telugu News