Share News

దసరా నాటికి అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్: భూపతిరాజు శ్రీనివాసవర్మ

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:13 AM

గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పరిశీలించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

దసరా నాటికి అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్: భూపతిరాజు శ్రీనివాసవర్మ
Bhupatiraju Srinivasa Varma

కృష్ణా, జూన్ 17: గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు(బుధవారం) ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో వృద్ధి చెందుతోందన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా.. కార్గో సేవలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.


ఏపీలో 8500 కిలోమీటర్ల జాతీయ రహదారిని ఎన్డీయే హయాంలో విస్తరించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల కన్నా ఎక్కువ నాణ్యతగల విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్నా, మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విమానాశ్రయ డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారన్నారు. దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశానికే తలమానికంగా అభివృద్ధి చేసి చూపిస్తామని భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

దుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాస మహోత్సవం.. తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు

రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 11:21 AM