కొడాలి నానికి ఆ భయం పట్టుకుంది: వెనిగండ్ల రాము
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:35 PM
మాజీ మంత్రి కొడాలి నానిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాపాలు, తప్పులు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా, మార్చి 2: కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తారనే భయంతో నాని బిక్కుబిక్కుమంటూ మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. పాపాలు, తప్పులు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. జైల్లో గుట్కాలు ఉంటాయా, సౌకర్యాల సంగతి తెలుసుకునేందుకే అంబటి రాంబాబును కలిశారని రాము ఎద్దేవా చేశారు. చేసిన తప్పులు, పాపాలు బయటపడతాయనే భయం నానిని పట్టుకుందని వెనిగండ్ల రాము అన్నారు. వంద రోజుల జైలు టైం కూడా పెట్టుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
నానిని లేదా ఎవరినైనా అన్యాయంగా అరెస్ట్ చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, టీడీపీ కార్యకర్త అయినా అదే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. సప్త సముద్రాలు దాటి తమ సంగతి చూడాల్సిన అవసరం లేదని.. గుడివాడ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే చాలని రాము సూచించారు. పరామర్శించి అటునుంచి అటే వెళ్లిపోయారని, గుడివాడ ప్రజలకు మొహం చూపించే సాహసం కూడా లేదని వెనిగండ్ల రాము విమర్శించారు.
నిజమేంటో ప్రజలకు తెలుసునని, సొల్లు చెప్పుకుంటూ పోతే ఈసారి డిపాజిట్లు కూడా రావని ఆయన హెచ్చరించారు. ప్రజలు పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం వ్యర్థమని రాము అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా గురించి తప్పితే, ప్రజల గురించి వైసీపీ వారికి ఏమీ పట్టదని విమర్శించారు. గుడివాడ నియోజకవర్గంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని.. ఒక్కరికైనా సహాయం అందించారా అని ప్రశ్నించారు. 2019లాగా ఇక ప్రజలు మోసపోరని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో బిజీబిజీగా సీజేఐ పర్యటన
రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం
Read Latest AP News And Telugu News