Share News

వరలక్ష్మీ వ్రతం.. దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:14 PM

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.

వరలక్ష్మీ వ్రతం.. దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Varalakshmi Vratham

విజయవాడ, ఆగస్టు 21: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దుర్గమ్మ ఆలయంతోపాటు రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.


  • ఏలూరు జిల్లా: జిల్లాలోని ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. శాకంబరీ దేవి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు.. భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించారు. భక్తులు.. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

  • ప.గో: భీమవరం మావుళ్లమ్మకు నాలుగు లక్షల గాజులతో అలంకరించారు.శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఇందుకోసం భక్తులు నాలుగు లక్షల గాజులను సమర్పించారు.

  • నెల్లూరు: జిల్లాలో శ్రావణ శుక్రవార పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేషార్చనలు, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.

  • తిరుపతి: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని గాజులు, వజ్రకిరీటంతో ప్రత్యేకంగా అలంకరించారు. అటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • విశాఖపట్నం: శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపారు. శ్రీకనకమహాలక్ష్మి, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


ఇవి కూడా చదవండి...

అన్నవరం బస్టాండ్‌‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు..

అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 12:43 PM