భారతీరాజా మృతికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:36 AM
ప్రముఖ దర్శకులు భారతీరాజా మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
అమరావతి, జూన్ 10: ప్రముఖ దర్శకులు భారతీరాజా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారతీరాజా మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.
సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం బాధాకరం: పవన్
‘ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్కు ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్తోను ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. భారతీరాజా మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ఎక్స్లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్
Read Latest AP News And Telugu News