Share News

వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా?.. వైసీపీ తీరుపై పవన్ కల్యాణ్ ధ్వజం

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:28 PM

భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను కూడా నేడు కుల చట్రాల్లో బంధించడానికి సగటు రాజకీయ ఆలోచనలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా?.. వైసీపీ తీరుపై పవన్ కల్యాణ్ ధ్వజం
Pawan Kalyan

అమరావతి, జూన్ 03: భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులను కూడా నేడు కుల చట్రాల్లో బంధించడానికి సగటు రాజకీయ ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన కుల నిర్మూలన పక్కనబెడితే.. 1989 నుంచి రాజకీయాల్లో కుల దూషణలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.


గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరీ దిగజారిందని, సమాజానికి అద్దం పట్టే జర్నలిస్టులను సైతం కులాల పేరుతో దూషించడం ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే, దానికి కులాలను ఆపాదిస్తూ సమాజంలో చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని హత్య చేసి, శవాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేసినా ఆ పార్టీ వెనుకేసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా హింసించి చంపేసినా ఆయా కుల సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కొంతమంది స్వార్థపరులు ఈ కుల సంఘాలను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా బాగుపడుతున్నారనే అనుమానం ఉందన్నారు. ఏ కులం నాయకుడితో ఆ కులం వారినే తిట్టించే నీచ సంస్కృతి వల్ల యువత భావోద్వేగాలకు లోనవుతున్నారని ఆందోళన చెందారు.


ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ తీరు మారలేదని, ఇలాంటి కుల రాజకీయాలకు చరమగీతం పాడాలని జనసేన గట్టిగా నిర్ణయించుకుందని స్పష్టం చేశారు. ఇటీవల కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో దీనిపై చర్చించామని.. ఎవరు ఎలా మాట్లాడినా తామంతా కలిసికట్టుగా స్పందిస్తామని పవన్ తెలిపారు. ఇకపై రాజకీయాల్లో జరిగే కుల దూషణలను, అరాచకాలను తిప్పికొట్టేందుకు జనసేన పక్షాన ‘సేన గళం’ పేరుతో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు, ఇకపై ఎవరు దూషించినా ‘సేన గళం’ గట్టిగా స్పందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

పెండింగ్‌‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

Updated Date - Jun 03 , 2026 | 06:28 PM