Share News

నిందితులను కాపాడేందుకేనా ఈ డ్రామా.. జగన్‌పై మంత్రి ఫైర్

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:50 PM

సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్‌మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైనే నిందలు వేయడం రాజకీయ సంస్కృతా అని జగన్‌ను నిలదీశారు.

నిందితులను కాపాడేందుకేనా ఈ డ్రామా.. జగన్‌పై మంత్రి ఫైర్
Anagani Sathya Prasad

అమరావతి, మార్చి 17: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Sathya Prasad) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్‌మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని విమర్శించారు. ‘అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ.. బాబాయ్‌ను చంపింది ఎవరో తెలిసినా సాక్ష్యాలు చెరిపేయడమే మీ పనా?’ అని ప్రశ్నించారు.


గుండెపోటు థియరీ నుంచి గొడ్డలి వేటు వరకు గంటకో మాట మార్చిన 'జగన్నాటకం' గూగుల్ టేకవుట్‌లో బట్టబయలైందని మంత్రి వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ వద్దని, నిందితుడు అవినాశ్ రెడ్డిని కాపాడటానికి బాంబులతో బెదిరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కన్నకూతురు సునీతమ్మపై అక్రమ సంబంధాల ముద్ర వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ కావాలన్నారు.. అధికారంలోకి వచ్చాక సీబీఐని తరిమికొట్టారు, ఇదేనా మీ నీతి’ అంటూ మంత్రి విరుచుకుపడ్డారు.


హత్య జరిగిన చోట రక్తపు మరకలను చెరిపేసి ఇంకో రకంగా చిత్రీకరించిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ‘హత్య కేసును ఆస్తి, అక్రమ సంబంధాల వైపు తిప్పడం.. అసలు నిందితులను కాపాడేందుకేనా ఈ డ్రామా?’ అని ప్రశ్నించారు. 15 రోజులకోసారి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి 3 గంటలు అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. ప్రజల మీద, కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేదని.. కేవలం దోచుకున్న వారిని కాపాడటమే వైసీపీ ఏకైక అజెండా అని ఆరోపించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైనే నిందలు వేయడం రాజకీయ సంస్కృతా అని నిలదీశారు. ‘అరాచకాలు, హత్యలు చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు.. అది గుర్తుపెట్టుకోండి’ అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

మిషన్ మోడ్‌లో మున్సిపాలిటీల అభివృద్ధి: మంత్రి నారాయణ

మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 05:34 PM