అమ్మవారి దర్శనానికి వస్తే నగలన్నీ దోచేశారు
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:35 AM
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ మహిళా భక్తురాలి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
విజయవాడ, మార్చి 7: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన మహిళా భక్తురాలి దగ్గర నుంచి సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. అమ్మవారి ఆలయంలో నేడు, రేపు మహా కుంభాభిషేకం మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళా భక్తురాలు.. బంధువుల పెళ్లి సందర్భంగా విజయవాడకు వచ్చారు. దుర్గమ్మ దర్శనం కోసం ఆలయానికి వచ్చిన మహిళ... అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రావిచెట్టు ప్రాంతంలోకి వచ్చారు.
అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు నగలు చోరీకి గురయ్యాయి. రద్దీ మధ్యలోనే దొంగలు ఆ బంగారాన్ని చోరీ చేసి ఉడాయించారు. వెంటనే సదరు భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అయితే కుంభభిషేకం మహోత్సవం సందర్భంగా ఆలయంలో ఎక్కడికక్కడ టెంట్లను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. సీసీ కెమెరాల్లో టెంట్లు అడ్డురావడంతో పోలీసులకు దొంగను కనిపెట్టడం తలనొప్పిగా మారిన పరిస్థితి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
Read Latest AP News And Telugu News