Share News

కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:31 AM

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌, గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా అవసరమని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం
CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 11: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ప్రభత్వ విధానాలపై క్లారీటీ ఇస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌, గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా అవసరమని చెప్పారు. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఈరోజు రీయాలిటీగా మారుతోందని సీఎం అన్నారు. ‘పర్వాలేదు’ అనే ఉదాసీనత కూడా చేయాల్సిన పనులపై ప్రభావం చూపుతాయని తెలిపారు. గతంలో విజన్ 2020 పెట్టినప్పుడు చాలామంది విమర్శించారని.. ఇప్పుడు అది ఫలితాన్ని ఇవ్వడంతో 2047వైపు అందరూ చూస్తున్నారని సీఎం అన్నారు.


20 నెలల్లో సూపర్ సిక్స్ హిట్..

ఈ కాన్ఫరెన్స్‌లో నిర్ధిష్టమైన టార్గెట్‌లను ఫిక్స్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈసారి 15 పాయింట్లను ఈ ఏడాది లక్ష్యాల కింద ఇస్తున్నట్లు చెప్పారు. 20 నెలల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని అన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు చేస్తామో ముందే చెబుతామని.. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ఈ నెలలో 13వ ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు సీఎం. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్మును జమ చేస్తుందన్నారు. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులతో కలిసి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్దామని సీఎం తెలిపారు.


విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీలు

ఖరీఫ్‌కు ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్‌ చేయాలని సీఎం సూచించారు. మే 15న నీటిని విడుదల చేస్తున్నామని, ఈ సీజన్లో ముందుగానే నీరు ఇస్తామన్నారు. ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పారు. దివ్యాంగులకు ‘ఇంద్రధనస్సు’ పేరుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. చరిత్రలోనే తొలిసారి విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీలను ప్రవేశపెట్టామని.. వినియోగదారులకు బెనిఫిట్ వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ చార్జీలను 39 పైసలు తగ్గిస్తున్నామని.. తద్వరా వినియోగదారులపై భారం భారీగా తగ్గనుందన్నారు. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.


5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా లక్ష మంది మహిళా పారిశ్రమికవేత్తలను తయారు చేయాలని నిర్ణయించామని సీఎం అన్నారు. అయితే ఏడాదిలోనే లక్షా 15వేల మందిని తయారు చేశామన్నారు. ఈ ఏడాది 5 లక్షల మందిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఎస్టోనియా, ఇజ్రాయిల్, సింగపూర్‌లు ఎంట్రపెన్యూర్‌లను తీసుకువచ్చారని.. ఏపీలో కూడా ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు అగ్రిటెక్ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను డీమ్డ్ యూనివర్సిటీగా తేవాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ముందే సాగుకు సిద్ధం అవుదాం..

విద్యుత్ ఉత్పాదన ఓ సంపాదనా మార్గంగా మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ కింద 1.12 లక్షల మంది మహిళా మైక్రో ఎంట్రప్రెన్యూర్‌లు తయారయ్యారని తెలిపారు. మే 15 నుంచే సాగుకు సిద్ధం అవుదామని.. ఏఐ అగ్రానమిస్ట్ సేవలు కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ వ్యవసాయదారుడికి ఏఐ అగ్రానమిస్ట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.


నీటి సంరక్షణా చర్యలు..

సమర్ధ నీటి నిర్వహణ చాలా కీలకమైన అంశమని.. నీటి భద్రత కోసం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.82 మీటర్ల మేర భూగర్భజలాలు గడిచిన రెండు నెలల్లో పెరిగాయన్నారు. మార్చి 1 నాటికి 8.10 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయని వెల్లడించారు. 90 రోజుల పాటు ఏప్రిల్ 1 నుంచి జూన్ నెలాఖరు వరకూ నీటి సంరక్షణా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నో సబ్ మెర్జెన్స్ విధానంలో కాలువల పూడికలు, చెరువుల లింకేజి లాంటి కార్యాచరణ చేపట్టాలన్నారు.


జులై నాటికి వెలిగొండ పూర్తి

ప్రస్తుతం రాష్ట్రంలో 614 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నాయని సీఎం అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగు సీజన్‌ను ముందుకు తీసుకువచ్చేలా ప్రణాళిక చేస్తున్నామని వెల్లడించారు. భూగర్భ జలాలు పెరిగితే ప్రభుత్వం ఇస్తున్న రూ.14 వేల కోట్ల విద్యుత్ సబ్సీడీలు భారం తగ్గుతుందన్నారు. వెలిగొండను జూలై నాటికి పూర్తి చేసి నీటిని ఇస్తామని... 30 ఏళ్ల క్రితం తానే శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ...

2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎక్కడా భూ వివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. పిటిషన్ కల్చర్‌ను తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. వాస్తవాలన్నీ పోర్టల్లో పెడితే వివాదాలు తగ్గుతాయన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం కావాలని... అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలని తెలిపారు. భూ వివాదాలు లేకపోతే 70 శాతం సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు.. రొయ్యల రైతులకు మంత్రి సూచన

టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలు... కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 12:17 PM