పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:27 PM
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్పై వర్క్ షాప్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు.
అమరావతి, జూన్ 2: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్పై వర్క్ షాప్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకువెళ్లాలని.. బలం ఎక్కువా తక్కువా అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యులను చేయాల్సిందే అని చెప్పారు.
పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొమమాటం లేకుండా పక్కనపెట్టేస్తానని తేల్చిచెప్పేశారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీలో రెండు సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ‘మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే.. ఓట్లు పడతాయి.. ప్రజలు ఆదరిస్తారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి.. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పనిచేయకపోయినా పర్వాలేదు.. నోరు మాత్రం పారేసుకోవద్దు. తస్మాత్... జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
Read Latest AP News And Telugu News