బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు సీఎం చంద్రబాబుతోనే సాధ్యం: మంత్రి సవిత..
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:40 PM
వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవ జీవనమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో బీసీ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయవాడ: వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవ జీవనమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ గుర్తింపు సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆమె చెప్పుకొచ్చారు. గొల్లపూడి బీసీ భవన్లో బీసీ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఆ సమయంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారని, ఈ మేరకు చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయనున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుందని కొనియాడారు. చట్టం ప్రకారం బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణకు గురిచేసినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని, రెండు నెలల్లో కేసుల దర్యాప్తు పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించామని పేర్కొన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా చూస్తున్నామనీ మంత్రి చెప్పుకొచ్చారు.
బీసీ రక్షణ చట్టంపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇప్పుడు 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల ఛైర్మన్ల నుంచీ అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి జగన్ గత ప్రభుత్వం తగ్గించిందని ఆమె మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందని తేల్చి చెప్పారు. ఆ ఎన్నికల్లో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో ఇప్పటికే 90 శాతం అమలు చేశామని, మిగతావి త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. మరోవైపు, ఆదరణ 3.0ను అమలు చేస్తామని మంత్రి సవిత చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెడికో ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు: డీజీపీ
గణేశ్ ఉత్సవాలు.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండొద్దు: హోం మంత్రి అనిత