పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:12 PM
రోజు గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ఆమె విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు.
అమరావతి, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా ప్రజా ప్రతినిధులు సైకిల్ తొక్కారు. అలానే రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు. అనంతరం ఆమె ఏబీఎన్తో మాట్లాడారు. రోజూ ఓ గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని తెలిపారు. ప్రధాని పొదుపు మంత్రంలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తున్నామని ఆమె వెల్లడించారు.
'సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తో పాటు మంత్రులందరం కాన్వాయ్ వెహికల్లను తగ్గించాం. అవకాశం ఉంటే పోలీసులంతా ఒకే వెహికల్లో వెళ్లే యోచన కూడా చేస్తాం. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అందుకే ప్రజా ప్రతినిధులంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సైకిళ్లు తొక్కుతున్నాం' అని ఆమె తెలిపారు.
'పెట్రోల్, డీజిల్, బంగారం లాంటివి కొనుగోలు తగ్గించడం వల్ల విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. డాలర్తో రూపాయి విలువ తగ్గుతుంది. ఈ విషయాలను ప్రజలందరూ గమనించి పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించాలి. సైకిల్ తొక్కాలి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి' అని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి: రామ్మోహన్ నాయుడు